
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
ఆంజనేయులు న్యూస్, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ, తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేశామని.. ప్రయోగాత్మకంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బ్రేక్ దర్శనాలు ఉంటాయన్నారు. బ్రహ్మోత్సవాల అనంతరం టైమ్ స్లాట్ టోకెన్ల జారీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నారని.. ప్రాథమికంగా రోజుకు 20వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామన్నారు. తిరుమల గదుల కేటాయింపులోనూ మార్పులు చేసినట్లు చెప్పారు. తిరుమలలో వసతి గదుల కేటాయింపు తిరుపతిలోనే చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
