
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
మంచిర్యాల జిల్లా: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రహదారులు, మురుగు కాలువలు, నివాస ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలకుండా పురపాలక, పంచాయతీరాజ్, సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శుక్రవారం గ్రామాలలో, ఆదివారం పట్టణాలలో డ్రైడే పాటించే విధంగా కార్యచరణ రూపొందించాలని, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీ, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుబ్బారాయుడు, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జెడ్పీ సిఇఓ నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
