Monday, August 17, 2026
HomeTelanganaసీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ దిశగా చర్యలు..?

సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ దిశగా చర్యలు..?

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి

ఆహారం, త్రాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

మంచిర్యాల జిల్లా: జిల్లాలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయి నియంత్రణ దిశగా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి సీజనల్ వ్యాధులు, వైద్య శిబిరాలు, వ్యాక్సినేషన్, పారిశుద్ధ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, పురపాలక శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని, జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ విషజ్వరాల కేసులు నమోదు అయ్యే ప్రాంతాలను గుర్తించి నియంత్రణ దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని, రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతిగృహాలలో పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆహారం, త్రాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు మూత్రశాలలు, నీటి వినియోగం నేర్పించాలని, పిల్లల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వ్యక్తిగత పరిశు భ్రతతో పాటు పరిసరాల శుభ్రత ఖచ్చితంగా పాటిస్తే వ్యాధుల వ్యాప్తిని నియంత్రించవచ్చని ప్రజలకు తెలియజేయాలని, గ్రామాలలో వ్యాధుల వ్యాప్తి విధానాలు, నివారణ చర్యలపై కళాజాత ద్వారా అవగాహన కల్పించాలని తెలిపారు.

వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మందులను అందించాలని, విషజ్వరాల అనుమానితులకు పరీక్షలు నిర్వహించి తగు చికిత్స అందించాలని తెలిపారు. దోమల నివారణకు యాంటీ లార్వా స్ప్రే చేయాలని, ఫాగింగ్ చేపట్టాలని, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య చర్యలపై నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. వసతి గృహాలలో విద్యార్థులు కాచి చల్లార్చి వడపోసిన నీటిని మాత్రమే అందించాలని, వసతిగృహాలను సంబంధిత జిల్లా అధికారులు సందర్శించాలని, విద్యార్థులతో భోజనం చేసి ఆహారం నాణ్యతను పరిశీలించాలని, ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వసతి గృహాలు, వంట శాలలు, స్టోర్ రూమ్లు, మూత్రశాలలు, శౌచాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందించాలని, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల వైద్యాధికారులు మండలాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ బూస్టర్ను అర్హులైన వారికి అందించడంతో పాటు పాఠశాలల్లో 12-17 సం॥ల వయస్సు గల విద్యార్థినీ, విద్యార్థులకు కరోనా టీకా అందించాలని తెలిపారు. మన ఊరు – మన బడి కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, మిషన్ భగీరథ పథకం ద్వారా పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు నల్లా కనెక్షన్లు అందించి త్రాగునీటిని సరఫరా చేయాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను గుర్తించి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రహదారులు, మురుగు కాలువలు, నివాస ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమం చేపట్టి ప్రజలను భాగస్వామ్యులను చేయడమే కాకుండా కార్యక్రమ ఆవశ్యకతను వివరించాలని, గ్రామాలు, పట్టణాలలో డ్రై డే పాటించే విధంగా కార్యచరణ రూపొందించాలని, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా॥ సుబ్బారాయుడు, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.