12వ ఆవిర్భావ వేడుకల్లో వృద్ధులకు అన్నదానం
కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్
మంచిర్యాల, జూలై 23, ( ఆంజనేయులు న్యూస్ )
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టిజెఎ) నిరంతరం పోరాటం చేస్తోందని టిజెఎ జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం టిజెఎ 12వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ ఆదేశాలు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ నేతృత్వంలో కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జర్నలిస్టులు వృద్ధులకు అన్నదానం నిర్వహించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ కేక్ కట్ చేసి వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని జర్నలిస్టు నాయకులు, సభ్యులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంఘీభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని జర్నలిస్టులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి ఐక్యతను బలోపేతం చేయడంలో టిజెఎ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సంస్థను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ అందిస్తున్న సేవలు, క్రమశిక్షణ ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన భద్రత కోసం టిజెఎ నిరంతరం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిజెఎ జిల్లా నాయకులు సారంగరావు, డేగ ఆంజనేయులు, గట్టయ్య, గంగులు, అమర్నాథ్ రెడ్డి, గౌతం, పురుషోత్తం, ప్రేమ్ జీవన్, సతీష్, వినీత్, సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
