ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి శనివారం అవగాహన ర్యాలీని ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ నాయక్, ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ శ్రీధర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూలై 11 నుంచి 18 వరకు కుటుంబ సంక్షేమం, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కుటుంబ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా “పిల్లలకు సరైన అంతరం… కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం” అనే సందేశంతో అర్హులైన దంపతులకు అవగాహన కల్పించాలని సూచించారు. తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళలకు నోటి గర్భనిరోధక మాత్రలు, మాల-ఎన్, ఛాయ మాత్రలు, అత్యవసర గర్భనిరోధక మాత్రలు (ఈసీ పిల్స్), ఐయూసీడీ, అంతరా ఇంజెక్షన్ వంటి తాత్కాలిక కుటుంబ నియంత్రణ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అలాగే అవసరమైన వారికి పురుష, మహిళల శాశ్వత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో పెరుగుతున్న జనాభా నేపథ్యంలో “చిన్న కుటుంబం… చింతలేని కుటుంబం” అనే భావనను ప్రతి ఇంటికి చేరవేయాలని, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో చిన్న సమావేశాలు నిర్వహించి కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నోటీసు బోర్డులు, ప్రచార సామగ్రి ద్వారా కూడా ప్రజలకు సమాచారం అందించాలని జిల్లా వైద్యాధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, మాస్ మీడియా బృందం సభ్యులు అల్లాడి శ్రీనివాస్, ఎం.డి. రషీద్, సీహెచ్వోలు నాందేవ్, కాకిరాల వెంకటేశ్వర్లు, పుట్ట సత్తయ్య, ఆర్.ఎస్. పద్మ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.