ప్రపంచ జనాభా దినోత్సవం.. కుటుంబ నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
జులై 11 నుంచి 18 వరకు జిల్లావ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభం
మంచిర్యాల జులై 10, (ఆంజనేయులు న్యూస్)
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జులై 11 నుంచి 18వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న కుటుంబ సంక్షేమ, కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమాలకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల పరిధిలో వైద్యులు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ప్రజలకు కుటుంబ నియంత్రణ పద్ధతులు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. చిన్న కుటుంబం–సంతోషకర కుటుంబం అనే లక్ష్యంతో దంపతులు కుటుంబ నియంత్రణ పద్ధతులను అనుసరించడం ద్వారా ఆరోగ్యవంతమైన కుటుంబ జీవితం, పిల్లల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలకు నోటి గర్భనిరోధక మాత్రలు, అంతర ఇంజెక్షన్, మాల-ఎన్, ఛాయా, ఈజీ పిల్, ఐయూసీడీ వంటి తాత్కాలిక గర్భనిరోధక పద్ధతులు, పురుషులకు నిరోధ్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులైన పురుషులకు వాసెక్టమీ, మహిళలకు ట్యూబెక్టమీపై కూడా ప్రచారం నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. “పిల్లలకు సరైన అంతరం – ఆరోగ్యకరమైన కుటుంబం”, “చిన్న కుటుంబం – చింతలేని కుటుంబం” అనే నినాదాలతో గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని డీఎంహెచ్వో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ అశోక్, డాక్టర్ తబియా, ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణ శ్రీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, డిపిహెచ్ఎన్ ఆర్.ఎస్. పద్మ, సీహెచ్వోలు కాకిరాల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, నాందేవ్, ప్రవళికతో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రచార సామగ్రిని పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమాలు శనివారం (జులై 11) నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.
