మెదడు రక్తస్రావానికి శస్త్రచికిత్స లేకుండాన చికిత్స
ఆరోగ్యంగా కోలుకున్న 70 ఏళ్ల వృద్ధుడు
యశోద ఆసుపత్రి న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సాయి సతీష్
మంచిర్యాల, జూలై 8, ( ఆంజనేయులు న్యూస్ )
తీవ్ర మెదడు రక్తస్రావంతో కోమాలోకి వెళ్లిన 70 ఏళ్ల వృద్ధుడికి అరుదైన ఆధునిక వైద్య చికిత్స అందించి ప్రాణాలు కాపాడినట్లు హైదరాబాద్ యశోద ఆసుపత్రి న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సాయి సతీష్ తెలిపారు. బుధవారం మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మందమర్రి మండలం గద్దెరాగడికి చెందిన కాసువార మల్లేష్ గత ఏడాది నవంబర్లో తీవ్ర తలనొప్పితో కుప్పకూలగా, మంచిర్యాలోని మెడిలైఫ్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అత్యవసర శస్త్రచికిత్స ద్వారా మొదట ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేలా చేశామని తెలిపారు. అనంతరం 2026 జనవరిలో మళ్లీ రక్తస్రావం సమస్య తలెత్తడంతో శస్త్రచికిత్స చేయకుండా తొడలోని రక్తనాళం ద్వారా మిడిల్ మెనింజియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (MMA Embolization) అనే ఆధునిక చికిత్సను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ప్రస్తుతం ఆరు నెలలుగా రోగి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. రోగి కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మెడిలైఫ్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ కౌటం కుమారస్వామి, యశోద ఆసుపత్రి మేనేజర్ అంకం మల్లేష్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

