
ఆంజనేయులు న్యూస్, ఖమ్మం జిల్లా: జిల్లాకు చెందిన వ్యక్తిని షేర్ మార్కెట్ పేరుతో మోసం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాలం ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని, షేర్ మార్కెట్ ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్లలో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి రూ.47 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుడికి వాట్సాప్ మరియు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన నిందితుడు ఆకర్షణీయమైన ఆఫర్లతో నమ్మించి డబ్బులు పెట్టుబడి పెట్టించాడని తెలిపారు. తరువాత లాభాలు రాకపోవడంతో పాటు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎండీ ఫిరోజ్ను Hyderabad City Police సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సీపీ సునీల్ దత్త వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ ఫణీందర్, సీఐ నరేష్, ఎస్సైలు రంజిత్ కుమార్, విజయ్ కుమార్లను సీపీ అభినందించారు. పోలీసులు ప్రజలు సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
