హోటళ్ల పరిస్థితి అధ్వానం.. పట్టించుకోని ఫుడ్ ఇన్స్పెక్టర్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో హోటళ్ల పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. పట్టణంలోని ప్రధాన వీధులు, బస్టాండ్ పరిసరాలు, కాలనీల్లో ఉన్న అనేక హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో ఆహార భద్రత నిబంధనలు పూర్తిగా గాలికొదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనారోగ్యకర పరిస్థితుల్లో ఆహారం తయారు చేయడం, మురికి నీరు, పాడైన నూనెలు వినియోగించడం, శుభ్రత లేకపోవడం వంటి అంశాలు బహిరంగంగానే కనిపిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం కనీస తనిఖీలు కూడా చేపట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మంచిర్యాలకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నట్టా.. లేనట్టా..?” అనే ప్రశ్న ప్రజల నోట వినిపిస్తోంది. నెలల తరబడి హోటళ్లపై తనిఖీలు లేవు, నోటీసులు లేవు, జరిమానాలు లేవు. దీంతో హోటల్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు, కల్తీ ఆహారం వల్ల చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కేవలం పండుగల సమయంలో లేదా పై అధికారుల తనిఖీలు ఉన్నప్పుడు మాత్రమే హడావుడిగా చర్యలు తీసుకుంటూ, మిగతా సమయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి హోటళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటళ్లపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని, పలువురు భోజనం ప్రియులు హెచ్చరిస్తున్నారు.
