
ఆంజనేయులు న్యూస్, హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లా కమలాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. వారం క్రితం మహిళకు సిజేరియన్ చేసి ప్రసవం చేసిన కమలాపూర్ ఆస్పత్రి వైద్యులు.. కడుపులో బ్యాండేజి ఉంచి అలాగే కుట్లు వేశారు. దీంతో బాలింతకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. మరోసారి ఆస్పత్రికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విధుల్లో ఉన్న నర్సుకు ఫోన్ చేసిన వైద్యురాలు.. బ్యాండేజ్ ఎలా తీయాలో ఫోన్లోనే వివరించారు. అది తీసే క్రమంలో సిజేరియన్ సమయంలో బాలింతకు వేసిన కుట్లు ఊడిపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకొని బాధితులకు సర్దిచెప్పి పంపించారు..
