
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: ప్రైవేట్, కార్పొరేట్ బడుల్లో అడ్డగోలు ఫీజుల దోపిడీకి అడ్డుకట్టవేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజుల ఖరారుకు ప్రత్యేకంగా ఫీజు రెగ్యులేటరీ కమిటీని ఎఫ్ఆర్సీ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల ను ఖరారు చేస్తున్నట్టుగానే ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను ఖరారు చేయనున్నది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారు. ఈ బిల్లు ఆమోదం పొందగానే చట్టంగా మారుతుంది. ఆ చట్టం ఆధారంగా ఎఫ్ఆర్సీని ఏర్పాటు చేస్తారు. ఫీజుల నియంత్రణకు ప్రత్యేకంగా చట్టం తెస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇటీవలే మీడియాకు తెలిపారు. ఈ ఏడాది సాధ్యంకాక పోవచ్చని, 2025 -26 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 11,051 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటి లో కొన్ని బడ్జెట్ స్కూళ్లు, కొన్ని కార్పొరేట్ స్కూళ్లు. మొదట ఫీజులు ఖరారు చేయకుండా స్కూళ్లు ఉల్లంఘించి నట్టుగా నిరూపించడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలోనే మొదట ఫీజులు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడుల్లోని వసతులు, ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ఖరారు చేయనుంది. మూడేండ్లకొకసారి. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీ ఏ, బీఈడీ, లా వంటి ప్రొఫెషనల్ కోర్సు ల ఫీజులను తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేస్తున్నది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ ప్రతి మూడేండ్లకోసారి విద్యా సంస్థల ఆదాయ, వ్యయాలు, ఆడిటింగ్ రిపోర్టులు, వసతులను పరిశీలించి ఫీజుల ఖరారు తర్వాత ప్రభుత్వం ఆమోదిస్తున్నది.
