
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: ఇరుకిరుకు గదులు, శిథిల భవనాల్లో ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతుండగా, మరోవైపు అసలు భవనాలే లేని పాఠశాలలు.. విద్యార్థుల చదువులు కొండెక్కేలా చేస్తున్నాయి. కెరమెరి మండలం పిట్టగూడ గిరిజన ప్రాథమిక పాఠశాలలో 14 మంది పిల్లలున్నారు. ఇక్కడ భవనమే లేకపోవడంతో ఓ ఇంటి ఆవరణలో తరగతులు కొనసాగుతున్నాయి. తిర్యాణి మండలంలోని జెండగూడలో భవనం లేక ప్రాథమిక పాఠశాలను అంగన్వాడీ కేంద్రంలో నడుపుతున్నారు. మంగి సమీపంలోని తడకల గదిలోనే ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువుకుంటున్నారు. ఓ వ్యక్తికి చెందిన రేకులషెడ్డులో చింతలమానేపల్లి మండలం డబ్బా ఎక్స్ రోడ్ ప్రాథమిక పాఠశాల కొనసాగింది. అద్దె ఇవ్వకపోవడంతో సదరు వ్యక్తి తాళం వేయగా విద్యార్థులు భవన సదుపాయం కల్పించాలని రహదారిపై ధర్నా చేశారు. అధికారులు ఎలాగోలా ఒప్పించి మళ్లీ ఇదే షెడ్డులో పాఠశాలను కొనసాగించేలా చూస్తున్నారు.

