అధికారంలోకి వచ్చాక భారాస అవినీతిపై న్యాయవిచారణ జరిపిస్తాం
మా హామీలపై గందరగోళం సృష్టించేందుకు ఆ పార్టీ యత్నం
మీట్ ద ప్రెస్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: రాజకీయ పార్టీలకు ప్రజలు అధికారమిచ్చేది వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి కాదని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ పాలనలో నిర్బంధాలు ఉండవని స్పష్టం చేశారు. చక్కగా ఉన్న సెక్రటేరియట్, సీఎం క్యాంపు కార్యాలయం వంటి వాటిని కూలగొట్టి కొత్తవి కట్టడం లాంటి చర్యలకు పాల్పడబోమని చెప్పారు. డిసెంబరు 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. ఆ రోజు నుంచే ప్రగతిభవన్ పేరును బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రజాపాలన భవన్ గా మార్చుతామని, ప్రజలెవరైనా రావడానికి తలుపులు తెరుస్తామని తెలిపారు. భారాస పాలనపై వచ్చిన ఆరోపణలు, కాళేశ్వరం నిర్మాణంలో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ లో రేవంత్ మాట్లాడారు. “నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ కక్షపూరిత ధోరణితో వ్యవహరించలేదు. గతంలో కొడంగల్ లో నాపై దాడి జరిగినా వ్యక్తిగత కక్షతో ఎదురుదాడులేమీ చేయలేదు. వ్యవసాయానికి 3 గంటలే కరెంటు ఇస్తామని, రైతులు 10 హెచ్పి మోటార్లు కొనుక్కోవాలని నేను అనకున్నా అన్నట్లుగా కేసీఆర్ అబద్ధాలాడుతున్నారు. బోరు నీటిని పారించే దూరంపై, భూగర్భ జలాలను బట్టి 10 హెచ్పీ మోటార్లను అవసరమైన రైతులే కొంటారు. ఉచిత కరెంటుపై పేటెంట్ కాంగ్రెస్. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తామని ఇప్పుడూ మ్యానిఫెస్టోలో పెట్టాం. కాంగ్రెస్ హామీలపై గందరగోళం సృష్టించాలని భారాస చూస్తోంది. మా ఆరు గ్యారంటీలు అసాధ్యమన్న కేసీఆర్.. అంతకుమించి ఇస్తామని చెప్పడం ద్వారా వాటి అమలు సాధ్యమేనని అంగీకరించారు. రాష్ట్రంలో ఏ పార్టీకీ మెజారిటీ రాదని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందనే చర్చకు తావులేదు. 1994 నుంచి ప్రతి ఎన్నికలోనూ తెలుగు ప్రజలు ఏదో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో 80-85 సీట్లలో నెగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం.
