మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో ఏడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడే వరద పరిస్థితులపై లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం మంచిర్యాల మండల తహసిల్దార్ విన్న రాజేశ్వర్ తో కలిసి జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీర ప్రాంతం, బైపాస్ రోడ్డు, ఏ సి సి ప్రాంతాలలో ప్రవహిస్తున్న రాళ్లవాగు వరద పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల తోపాటు జిల్లాలో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద పరిస్థితులు ఏర్పడనున్నాయని, ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అత్యవసర సేవల నిమిత్తం ప్రజల సౌకర్యార్థం జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనంలో కంట్రోల్ రూమ్ నం.08736-250501 ఏర్పాటు చేయడం జరిగిందని, ఏదైనా అత్యవసర సేవల కొరకు ప్రజలు సంప్రదించవచ్చని తెలిపారు. గోదావరి నది, వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
