మంగళూరులో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇటీవల వచ్చిన ఒక ప్రయాణికుడు తన కుమార్తె డైపర్ లో బంగారాన్ని తరలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు.
ఆంజనేయులు న్యూస్, మంగళూరు: బంగారాన్ని తరలించేందుకు అక్రమార్కులు ప్రతిసారీ కొత్త ఎత్తులు వేస్తున్నారు. మంగళూరులో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇటీవల వచ్చిన ఒక ప్రయాణికుడు తన 22 నెలల కుమార్తె డైపర్ లో బంగారాన్ని తరలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. బంగారాన్ని పేస్టు రూపంలోకి మార్చి ప్యాకెట్లలో నింపి డైపర్ పెట్టినట్లు గుర్తించారు. అంతకుముందు మరో ప్రయాణికుడు బంగారాన్ని రేకులా తయారు చేసి బెల్టు వెనుక భాగంలో పెట్టుకొని తరలించేందుకు ప్రయత్నిస్తూ చిక్కాడు. మరో వ్యక్తి తన రహస్య భాగాల్లో బంగారాన్ని ఉంచి తీసుకెళుతుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి 15వ తేదీల మధ్యలో మంగళూరు విమానాశ్రయంలో రూ.90.67 లక్షల విలువైన 1606 గ్రాముల బంగారాన్ని జప్తు చేసినట్లు కస్టమ్స్ అధికారులు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

