జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 32వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 32వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, డిసిపి అఖిల్ మహాజన్, సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్ కలిసి ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా నుంచి గుస్సాడీ నృత్యాలతో క్రీడాకారులకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు సుమారు 1200 మంది పాల్గొన్నారు. 68 కబడ్డీ జట్లతో నాలుగు రోజులపాటు పోటీలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ..
క్రీడలు మానసిక ఉల్లాసానికి, ప్రశాంతతకు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరూ క్రీడలను అలవర్చుకోవాలని సూచించారు. ఆటలలో రాణించి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపు కోసం ఓ అధ్యయనంగా భావించాలన్నారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్య అతిథులు కబడ్డీ పోటీలను ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. నల్గొండ, అదిలాబాద్ జట్ల క్రీడాకారులతో మొదటి రోజు కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎసిపి తిరుపతి రెడ్డి, మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

