ఎనిమిదేళ్లుగా దేశం నిర్భందంలో ఉందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. భావస్వేచ్చే కాదు… బతికే స్వేచ్ఛ కూడా కరవైందని ఆక్షేపించారు. ఈ మేరకు తెలంగాణ సమాజానికి ఆయన బహిరంగ లేఖ రాశారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఎనిమిదేళ్లుగా దేశం నిర్భందంలో ఉందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. భావస్వేచ్ఛ కూడా కరవైందని ఆక్షేపించారు. ఈ మేరకు తెలంగాణ సమాజానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులంటున్నారని లేఖలో పేర్కొన్నారు. తప్పు ఎత్తి చూపడం నేరం అంటున్నారని.. బ్రిటిష్ వాళ్లు విభజించి పాలించిన సిద్ధాంతం భాజపా పాలనలో మళ్లీ పురుడు పోసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి పతనమైందని దుయ్యబట్టారు. ఉపాధి, ఉద్యోగం లేక 22 కోట్ల మంది యువశక్తి నిర్వీర్యమైపోతోందని మండిపడ్డారు. చమురు ధరలు చుక్కలనంటాయని.. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఆకలి సూచిలో 107వ స్థానానికి మన దేశం ఎగబాకిందని వాపోయారు.
• భాజపాకు తెరాస 8 ఏళ్లు వంతపాడింది..
“తెలంగాణ పాలన ఫాంహౌస్ కు పరిమితమైంది. భాజపా అరాచకాలకు తెరాస 8 ఏళ్లు వంతపాడింది. నల్ల చట్టాలకు మద్దతిచ్చింది. వ్యవస్థల విధ్వంసానికి అంతే లేదు. పథకాల మాటున అడ్డు అదుపు లేని దోపిడీ జరుగుతోంది. రైతు రుణమాఫీ హామీ అమలు లేదు… అన్నదాతల ఆత్మహత్యల పరంపర ఆగడం లేదు. ఉచిత ఎరువులు హామీ కాకెత్తుకెళ్లింది. నిరుద్యోగులకు భృతి ఓ భ్రమగా మిగిలింది. ఉద్యోగ ఖాళీల భర్తీ అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతోంది. విద్యా వ్యవస్థ విధ్వంసమైంది. ఉచిత వైద్యం ఎండమావిగా మిగిలింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో రాహుల్ గాంధీ దేశం కోసం అడుగు ముందుకు వేశారు. ఈ దుస్థితిని ప్రశ్నిస్తూ బానిస సంకెళ్లను తెంచేస్తూ అందర్నీ ఏకం చేస్తూ ‘భారత్ జోడో యాత్ర’గా బయలుదేరారు. ఆ నేతకు సమాజం అడుగడుగునా ఘన స్వాగతాలు “పలుకుతోంది” అని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.

