
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఫొటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2023 ను సంబంధిత శాఖల అధికారులు తమకు కేటాయించిన విధులను పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫొటో ఎలక్టోరల్ రోల్స్-2023 ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారుల సమన్వయంతో జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా స్పష్టంగా తయారు చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. ఆగస్టు 4 నుండి ఈ నెల 24వ తేదీ వరకు రేషనలైజేషన్, పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, వివరాలలో వ్యత్యాసాల తొలగింపు, జాబితాలో సక్రమంగా లేని ఫొటోల స్థానంలో స్పష్టత గల ఫొటోల అప్లోడ్, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఈ నెల 25 నుండి నవంబర్ 7వ తేదీ వరకు ఫారం-1, ఫారం-8 తయారీ, నవంబర్ 11న ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ప్రచురణ చేయడం జరుగుతుందని తెలిపారు. నవంబర్ 9 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, రెండు శనివారాలు, ఆదివారాలు అభ్యంతరాలు, దరఖాస్తులపై ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, డిసెంబర్ 26వ తేదీన పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. జనవరి 3, 2023 తేదీన పూర్తి స్థాయి పరిశీలన జరిపి వివరాలను అప్డేట్ చేసిన అనంతరం జనవరి 5వ తేదీన తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, ప్రతి పోలింగ్ కేంద్రంలో 1 వేయి 500 మంది ఓటర్లకు పరిమితి విధించడం జరిగిందని, అంతకంటే ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాల పరిధిలో నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో 19 పోలింగ్ కేంద్రాల మార్పులు, ప్రదేశాల మార్పు సంబంధించిన ప్రతిపాదనలపై అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని తెలిపారు.
జిల్లాలోని చెన్నూర్ (ఎస్.సి)-002 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 87 వేల 182 మంది పురుషులు, 86 వేల 312 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఓటర్లు ఉన్నారని, 225 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, బెల్లంపల్లి (ఎస్.సి.)-003 నియోజకవర్గంలో 80 వేల 232 మంది పురుషులు, 79 వేల 596 మంది మహిళలు, 14 మంది ఇతరులు ఉన్నారని, 222 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మంచిర్యాల-004 నియోజకవర్గంలో 1 లక్షా 23 వేల 560 మంది పురుషులు, 1 లక్షా 22 వేల 615 మంది మహళలు, 19 మంది ఇతరులు ఉండగా 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ తమ తరుపున బూత్ స్థాయిలో ఏజెంట్లను ఏర్పాటు చేసి ఓటర్ల జాబితా తయారీలో అధికారులకు సహకరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వేణు, శ్యామలదేవి, ఎన్నికల డి.టి. శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
