Monday, August 17, 2026
HomeTelanganaవినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు

వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై స్పష్టతనిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) వినాయక విగ్రహాల తయారీపై నిషేధం లేదని స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన నీటి కుంటల్లోనే పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని తెలిపింది. విగ్రహాల ఎత్తు తక్కువగా ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై పశ్చిమ బెంగాల్ మార్గదర్శకాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. గతేడాది పీవోపీ విగ్రహాలపై నిషేధం విధిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలను జారీ చేసింది.

సీపీసీబీ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ గణేష్ మూర్తి కళాకార్ సంఘ్ దాఖలు చేసిన పిటిషన్పై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్. నంద ధర్మాసనం విచారణ చేపట్టింది. శాస్త్రీయ అధ్యయనం లేకుండా సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాది దుర్గాప్రసాద్ వాదించారు. పీవోపీపై నిషేధం లేదని.. అలాంటప్పుడు కేవలం విగ్రహాల తయారీలో వినియోగించొద్దనడం సమంజసం కాదన్నారు. జీహెచ్ఎంసీ బేబీ పాండ్లను (నీటి కుంటలు) సరిగా నిర్వహించలేక.. పీవోపీ విగ్రహాల తయారీ, విక్రయాలు నిలిపివేయాలని కళాకారులపై దాడి చేస్తోందన్నారు. కొవిడు ముందు తయారు చేసిన విగ్రహాలనైనా విక్రయించేందుకు అనుమతివ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ.. పీవోపీ విగ్రహాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి వరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదని తెలిపింది.

ప్రస్తుతం నిషేధం లేనందున.. కొందరి ఉపాధి దెబ్బతినేలా ఉత్తర్వులు ఇవ్వమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో మాత్రం నిమజ్జనం చేయరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే బేబీ పాండ్లలో నిమజ్జనం చేసి వెంటనే తొలగించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్ లో నదులు, సముద్రాలు లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని పేర్కొంది. కనీసం విగ్రహాల ఎత్తును నియంత్రించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వం న్యాయవాది అభ్యర్ధనను తోసిపుచ్చిన హైకోర్టు.. కొత్త అంశాలను తెరపైకి తేవద్దని వ్యాఖ్యానించింది. సీపీసీబీ మార్గదర్శకాల చట్టబద్ధతను తుది విచారణలో తేలుస్తామంటూ విచారణను వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.