
ఎఐసిసి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా: కేంద్రంలోని ఐబీలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని మాత శిశు ఆసుపత్రికి కేటాయించాలని ఎఐసిసి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి ఒడ్డున వద్దన్నప్పటికి ఆసుపత్రి నిర్మించడంతో వరద బారిన పడిందన్నారు. కలెక్టర్ కార్యాలయానికి పనికి రాని స్థలం మాతా శిశు కేంద్రానికి ఎలా పనికి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. వరదల సమయంలో తాను ఎక్కడున్నానని ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. అనారోగ్యంతో ఉన్నందున తన ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాతా శిశు కేంద్రంలోని రోగులను, పిల్లలను ఆస్పత్రికి తరలించడంలో కీలక భూమిక పోషించిన విషయాన్ని విస్మరించరాదని ఆయన పేర్కొన్నారు.
అలాగే అల్పాహారం, భోజనాన్ని కూడా అందించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాతా, శిశువులను ప్రభుత్వ ఆసుపత్రి తరలించకపోతే వరద ప్రమాదంలో చిక్కుకొని ప్రాణ నష్టం జరిగేదని తెలిపారు. మాతా శిశు ఆసుపత్రిని ఇంటిగ్రేటేడ్ మార్కెట్ భవనంలోకి మార్చకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షురాలు సురేఖ, తదితరులు పాల్గొన్నారు..
