
హైదరాబాద్: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు (Gautham Raju) (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. గౌతమ్ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. గౌతమ్రాజు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు గౌతమ్రాజు ఎడిటర్ గా పనిచేశారు. సుమారు 850పైగా చిత్రాలకు ఎడిటర్గా పనిచేసి సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా తెలుగులో తెరకెక్కిన ఎన్నో హిట్ చిత్రాలకు ఆయన ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖ నటులు చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రామ్చరణ్, అల్లు అర్జున్ నటించిన ఎన్నో సినిమాలకు ఆయన పనిచేశారు. ‘ఆది’ ‘ఖైదీ నెంబర్ 150’, ‘గబ్బర్సింగ్’, ‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘గోపాల గోపాల’ ‘అదుర్స్’, ‘బలుపు’, ‘రచ్చ’, ‘ఊసరవెల్లి’, ‘బద్రీనాథ్’, ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ ‘కాటమరాయుడు’ తదితర ప్రాజెక్ట్ తో ఆయన సినీ ప్రేక్షకుడి మది గెలుచుకున్నారు. ‘చట్టానికి కళ్లులేవు’ సినిమాతో గౌతమ్రాజు ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టారు. ‘ఆది’ చిత్రానికి ఉత్తమ ఎడిటర్ గా నంది అవార్డును అందుకున్నారు..
