గత రెండేళ్లుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దయతో కొవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నామని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు.
ఆంజనేయులు న్యూస్, యాదాద్రి: ఏసు క్రీస్తు ప్రభువు దయతో కరోనా తగ్గిందన్న వ్యాఖ్యలతో విమర్శలు చుట్టుముట్టిన వేళ తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాదాద్రీశుడి దయతో కొవిడ్ వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉన్నందున.. కరోనాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శనివారం డీహెచ్ శ్రీనివాసరావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్ ఫోర్త్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తో కలిసి కొవిడ్ పై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఎవరి పనులు వారు చేసుకోవాలని సూచించారు. గత రెండేళ్లుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దయతో కొవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్నా. మరణాల శాతం ఉండబోదని, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని డీహెచ్ వివరించారు.

