షిర్డీ వెళ్తున్న యాత్రికుల బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ట్రక్కును ఢీకొట్టడంతో 10 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులున్నారు.
ఆంజనేయులు న్యూస్, ముంబయి: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షిర్డీ యాత్రికులతో వెళ్తేన్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఠాణె జిల్లా నుంచి యాత్రికులను తీసుకుని ఓ ప్రైవేటు లగ్జరీ బస్సు షిర్డీకి బయల్దేరింది. శుక్రవారం ఉదయం నాసిక్-షిర్డీ హైవేపై ఈ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.
సీఎం దిగ్భ్రాంతి..
నాసిక్ – షిర్డీ హైవేపై జరిగిన బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

