Telugu Updates
Logo
Natyam ad

బస్సు కింద పడుకుని యువకుడు చేసిన స్టంట్‌పై సజ్జనార్ సీరియస్

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడుకొని ఓ యువకుడు చేసిన వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఓ యువకుడు ఆర్టీసీ బస్సు కింద పడుకుని స్టంట్ చేసినట్లుగా ఓ వీడియో సోషల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వీడియోను బాగా గమనిస్తే. అది ఫేక్ అని తెలిసిపోతుంది. ఎవరో గ్రీన్ మ్యాట్‌లో వీడియో చిత్రీకరించి, దాన్ని బస్సు కింద పడుకున్నట్లుగా ఎడిట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, ఈ వీడియోపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని సజ్జనార్ తెలిపారు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఇలాంటి వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారని తెలిపారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదని హితవుపలికారు. లైక్‌‌లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉందన్నారు. కొందరు తమ సరదా కోసం ఇలాంటి వీడియోలను ఎడిట్ చేసి షేర్ చేస్తే.. వాటి కారణంగా ఇతరులు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలాంటి ఘటనలను టీజీ ఆర్టీసీ సీరియస్‌గా తీసుకుంటుందని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు..