కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న భూ బాధితులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రం జిల్లాలోని కొంతమంది తాసిల్దార్ లు తమ విధులను నిర్లక్ష్యం చేస్తూ ప్రజా సమస్యలపై పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు తహసీల్దార్ కార్యాలయాలను ఆశ్రయించినా ఎలాంటి స్పందన లేదని బాధితులు వాపోతున్నారు. రోజూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, చివరకు చెప్పులు అరిగే స్థితికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది తాసిల్దార్ లు వాటిని పట్టించుకోకుండా బేఖాతరు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పరిపాలనా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయే పరిస్థితి నెలకొంటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తాసిల్దార్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని, భూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని భూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

