జిల్లాకు ఒకే ఒక్కరి రాక

ఆంజనేయులు న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీపై జిల్లాకు వచ్చి దాదాపు 18 నెలలుగా తమ సొంత జిల్లాలకు వెళ్లామని ఎదురుచూస్తున్న తహసీల్దార్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. మల్టీజోన్-1 పరిధిలో మొత్తం 55 మంది తహసీల్దార్లకు స్థానచలనం కల్పిస్తూ భూపరిపాలన విభాగ ముఖ్య కమిషనరు నవీన్ మిత్తల్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో మంచిర్యాల జిల్లాలో పని చేస్తున్న తహసీల్దార్ ఇమ్రానాఖాన్ ఆదిలాబాద్ జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీకాగా.. జిల్లాలో పని చేస్తున్న ఏ ఒక్కరి పేరు లేకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. బదిలీ కోసం ఎదురుచూస్తున్న తహసీల్దార్లు తాజా ఉత్తర్వులతో మరింత ఆవేదన చెందారు. ఎన్నికల వేళ బదిలీ అయిన వీరికి రెండు సంవత్సరాలు సమీపిస్తున్నా బదిలీల గురించి ఊసే లేకపోవడం, తాజాగా కొంతమంది అభ్యర్థనను సమర్థిస్తూ బదిలీలు చేపట్టడం రెవెన్యూవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎన్నికల సందర్భంగా ఉపతహసీల్దార్లు సైతం కొందరు బదిలీపై జిల్లాకు వచ్చి తమ జిల్లాకు వెళ్లేందుకు నిరీక్షిస్తుండగా.. వారికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడకపోవడం సంబంధీకుల్లో అసహన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దాదాపు 10 మంది తహసీల్దార్లు మంచిర్యాలలో, ముగ్గురు కుమురంభీం ఆసిఫాబాద్లో, మరో నలుగురు నిర్మల్ జిల్లాలో పనిచేస్తుండగా.. ఆయా జిల్లాల వారు 10 మంది ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.

