ఖమ్మం జిల్లా: సత్తుపల్లి మండలం గంగారంలో ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు వీధి రౌడీల మాదిరిగా ప్రవర్తించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే…ఓ విద్యార్థి జన్మదిన వేడుక సందర్భంగా జూనియర్ బ్యాచ్ విద్యార్థులు కళాశాల సమీపంలోని తోటకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీనియర్ విద్యార్థులు ఉన్నారు. వారిలో ఒకరిని ఓ జూనియర్ సిగరెట్ ఇవ్వమని అడిగాడు. సిగరెట్ ఇచ్చిన సీనియర్ విద్యార్థి .. జూనియర్ను ‘ఏం చదువుతున్నావ్’ అని అడిగాడు. తొమ్మిదో తరగతి అని వెటకారంగా చెప్పడంతో తోటలో పరస్పరం దాడి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఇంజినీరింగ్ కళాశాల ఎదుట రోడ్డుపై రెండో సారి విద్యార్థులు ఘర్షణపడ్డారు. పరస్పరం పిడిగుద్దులు గుద్దుకుంటూ దూషణల పర్వం కొనసాగించారు. కొందరు విద్యార్థులు మరింత రెచ్చిపోయి వీధి రౌడీల్లా ప్రవర్తించారు. కర్రలు, బీరు సీసాలతో పరస్పరం దాడి చేసుకున్నారు.
ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి వీడియో తీయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.