
ఆంజనేయులు న్యూస్, ఖమ్మం జిల్లా: ముదిగొండ మండలం బాణాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బైకు ను ఆపి లిఫ్ట్ అడిగిన దుండగుడు.. కొంతదూరం వెళ్లాక వాహనదారుడికి ఇంజెక్షన్ ఇచ్చాడు. అనంతరం వాహనదారుడు స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు.
ఆంజనేయులు న్యూస్ వెబ్సైట్ కథనం ప్రకారం.! చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (40) తన చిన్న కుమార్తెను ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. భార్య ప్రస్తుతం వల్లభిలో కుమార్తె వద్ద ఉండటంతో ఆమెను తీసుకొచ్చేందుకు జమాల్ ద్విచక్ర వాహనంపై తన ఇంటి నుంచి బయలుదేరాడు. వల్లభి సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తి జమాల్ ను లిఫ్ట్ అడిగాడు. దీంతో జమాల్ అతడిని తన వాహనంపై ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లగానే దుండగుడు తనకు ఓ ఇంజెక్షన్ ఇచ్చినట్లు గుర్తించారు. వెంటనే ఆయన తన వాహనం ఆపగానే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని జమాల్ తన భార్యకు ఫోన్ లో తెలిపారు. అనంతరం ఆయన స్పృహ కోల్పోవడంతో అటుగా వచ్చిన వాహనదారులు 108లో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గంమధ్యలోనే జమాల్ మృతిచెందారు. ఘటనాస్థలంలో ఇంజెక్షన్, సిరంజీ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ముదిగొండ ఆస్పత్రికి తరలించారు.

