ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో జరుగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కొరకు వినియోగించనున్న ఈ.వి.ఎం., వి.వి. ప్యాట్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద రక్షణ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్ అన్నారు. మంగళవారం 004-మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, డి.సి.పి. సుధీర్ రామ్నాథ్ కేకన్, 004-మంచిర్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాములు, ఎ.సి.పి. తిరుపతిరెడ్డిలతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన జరుగనున్న పోలింగ్ లో వినియోగించనున్న బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి. ప్యాట్ల భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని, సి.సి. కెమెరాలు ఏర్పాటు చేసి ఎల్లప్పుడూ పరిశీలించాలని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలోని 002-చెన్నూర్ (ఎస్.సి.) నియోజకవర్గ పరిధిలో చెన్నూర్ మండలం కిష్టంపేటలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 003-బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 004-మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ.వి.ఎం., వి.వి. ప్యాట్ల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

