జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపర్చడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, డి.సి.పి. సుధీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా పశు వైద్య, సంవర్ధశాఖ సంయుక్త సంచాలకులు డా॥ రమేష్, జిల్లా పశు సంవర్ధశాఖ సహాయ సంచాలకులు ఈ. శంకర్ తో కలిసి గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపర్చడం, జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం ప్రతి పౌరుడి విధి అని అన్నారు. పశువులు, ఇతర జంతువులు, పక్షులను నిబంధనల మేరకు తరలించాలని, అక్రమ రవాణాకు పాల్పడితే శిక్షార్హులని, తెలంగాణ రాష్ట్ర గోవధ నిషేధ చట్టం ప్రకారం ఆవులు, దూడలను వధించడం నిషేధించడం జరిగిందని, జంతువుల, పక్షుల బలి నిషేధ చట్టం ప్రకారం ఆలయ ప్రాంగణాలు, ఇతర బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, కర్మాగారాలలో జంతువులు, పక్షులను బలి ఇవ్వడం నిషేధించడం జరిగిందని తెలిపారు. జంతువులను హింసించడం, బాధించడం, బాధ కలిగేలా ప్రవర్తించడం శిక్షార్హమైన నేరమని, పెట్ షాప్లు నిర్వహించే వారు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పెంపుడు జంతువుల సంతాన వృద్ధి, అమ్మే వ్యాపారం చేసే వారు తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ అనుమతి తప్పనిసరిగా పొందాలని తెలిపారు. జంతు హింసకు పాల్పడినా, వాటి ఆవాసాలను ధ్వంసం చేసినా, వాటి సంరక్షణకు సేవ చేస్తున్న వారిని అడ్డుకొని ఇబ్బందిపెట్టినా శిక్షార్హులని అన్నారు. వీధి కుక్కలు, పిల్లుల సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేసేందుకు మున్సిపల్, జంతు సంరక్షణ సంస్థలు విధిగా జాతీయ జంతు కళ్యాణ మండలి గుర్తింపు, అనుమతి పొందాలని, జంతువుల అక్రమ రవాణా, అక్రమ వధ, జంతు సంరక్షణ కేంద్రాలలో హింసకు గురైన జంతువులు, పక్షులను సంబంధిత ప్రభుత్వ అధికారులు వాటిని సంరక్షణ కేంద్రాలకు పంపించేప్పుడు నిబంధనల మేరకు అర్హమైన సంస్థలకే ఇవ్వాలని తెలిపారు. వీధి కుక్కలు, పిల్లులు, పశువులు, పక్షులకు నివాస ప్రాంతాలలో ఆహానం అందించడం, సంరక్షించడం, వైద్యం అందించడం బాధ్యతగా తీసుకోవాలని, యజమానులు, నివాసితుల సంక్షేమ సంఘాలు తప్పనిసరిగా జంతు సంక్షేమ పర్యవేక్షక కమిటీలు ఏర్పాటు చేసుకొని వాటిని సంరక్షించాలని, పశువులు, కోడి పుంజులు, కుక్కలతో పందాలు, పోటీలు నిర్వహించడం, పాల్గొనడం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

