ఒసేయ్ నేను ఎస్సై విక్రమ్.!?..
నన్నెవరూ ఏమీ చేయలేరు
కావాలంటే పది లక్షలు పడేస్తా
కేసు వాపసు తీసుకో
బాధితురాలి పై సిబి సీఐడీ ఎస్.ఐ దబాయింపు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే ఈ ఘటన
కోర్టు సమీపంలో అతగాడి హల్ చల్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ‘ఒసేయ్..! నేను పోలీసు అధికారిని. అందులో ఎస్సైని. సిఐడి విభాగంలో పని చేస్తున్న. నాపై, నా కుటుంబ సభ్యుల పైనే వరకట్నం కేసు పెడతావా..? నిన్ను, మీ కుటుంబ సభ్యుల అంతు చూస్తా..’ అత్తింటి వారి వేధింపులు తాళలేక వరకట్నం కేసు నమోదు చేసిన బాధితురాలి పట్ల ఆమె భర్త దబాయింపుల బాగోతమిది. సాక్షాత్తూ.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే, అందులో కోర్టు ప్రాంగణ ప్రాంతంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దబాయింపుతో పాటు చేతికి పని కల్పించిన అతగాడి వ్యవహారంపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన బొల్లం సరితకు, ప్రస్తుతం కరీంనగర్ లో ఉంటున్న బొల్లం విక్రంకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె భర్త విక్రమ్ సీఐడీ విభాగంలో ఎస్సైగా పని చేస్తున్నాడు. వివాహం అనంతరం ఆత్తింటి వారు వేధిస్తున్నారంటూ సరిత వారిపై కేసు పెట్టింది. హెచ్ఎంఓపీ నెంబర్:102/2020 నెంబర్ గల కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో విచారణ సాగుతోంది. ఇందులో భాగంగానే ఈనెల 10వ తేదీన మంచిర్యాలలోని సివిల్ జూనియర్ జడ్జి ముందుకు కేసు విచారణ నిమిత్తం ఆమె వచ్చింది. తన తండ్రి వెన్నంపల్లి రమేష్ తో కోర్టుకు హాజరైంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో.. కేసు విచారణ కోసం కోర్టుకు రాగా తన భర్త బోల్లం విక్రం స్నేహితుడు కలిసి తన వద్దకు వచ్చాడని, వచ్చే రావడంతోనే ‘ఒసేయ్ నామీద నా కుటుంబ సభ్యుల మీద కేసు పెడతావా..’ అంటూ దుర్భాషలాడినట్లు బాధితురాలు వాపోయింది. అంతటితో ఆగకుండా ‘నేను ఎస్ఐని. నువ్వు నన్ను ఏం చేయలేవు. నేను తలుచుకుంటే.. నిన్ను, నీ కుటుంబ సభ్యులను అంతు చూస్తా..’అంటూ భయభ్రాంతులకు గురి చేసినట్లు ఆమె తన గోడు వెళ్ళబోసుకుంది. అంతేకాకుండా చెంపపై చేతితో కొట్టాడని, కాలుతో తన్నినట్లు ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది.
• పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..
జరిగిన ఘటనపై బాధితురాలు బొల్లం సరిత ముందుగా 100 నెంబర్ కు డయల్ చేసింది. పోలీసులు హుటాహుటిన రావడంతో మంచిర్యాల స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను నానా దుర్భాషలాడుతూ ఆడడంతో పాటు చేయి చేసుకున్నాడని ఆ ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. కేసు విచారణలో ఉండగా చంపుతానని బెదిరించడం తనతో పాటు తన కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తున్నదని ఆమె తెలిపింది.

