
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న గుండి గ్రామస్తుల కష్టాలు అన్ని ఇన్ని కావు. పాలకులు మారుతున్న ప్రభుత్వాలు మారుతున్న గుండి వాగుపై వంతెన నిర్మాణం పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఎలుకకు పిల్లి ప్రాణ సంకటం గుండి గ్రామస్తులకు వాగు గండం అన్నట్లుగా వారి పరిస్థితి ఉంది. వంతెన నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు కాకపోవడంతో వాగు దాటేందుకు ఆయా గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మూడు కిలోమీటర్లు ఉన్న జిల్లా కేంద్రానికి వాంకిడి మండలం కమన మీదుగా 30 కిలోమీటర్లు ప్రయాణించి ఆసిఫాబాద్ కేంద్రానికి చేరుకుంటున్నారు. భారీ వర్షాలు కురిస్తే వాగు ఉధృతంగా ప్రవహించడం తగ్గిన తర్వాత ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వాగు దాటడం వారికి నిత్య కృత్యంగా మారింది. తప్పని పరిస్థితులలో అత్యవసర పరిస్థితిలో ఇక్కడ ఏర్పాటు చేసిన తెప్పల పైన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు గుండి వాగు పై వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు..

