మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రిజిస్టర్ కాని, నోటరీ ద్వారా జరిగిన వ్యవసాయ భూముల లావాదేవీల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సరైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా జరిగిన అన్ రిజిస్టర్ – నోటరీ ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయ విక్రయాల లావాదేవీలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. సరైన పద్ధతిలో భూ విక్రయాలు జరుగునందున ఆస్తి బదిలీల విషయంలో సదరు విక్రయాలను ప్రశ్నించే వ్యాజ్యాలు నమోదు కావడం జరుగుతుందని తెలిపారు. నోటరీ చేయబడిన లావాదేవీలను నియంత్రించడంతో పాటు సమస్యను పరిశీలించి సమర్పించేందుకు ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసిందని, భూముల క్రమబద్ధీకరణ పై ఇట్టి కమిటీ అందించిన నివేదిక ప్రకారం వ్యవసాయేతర, పట్టణ ఆస్తుల లావాదేవీల క్రమబద్ధీకరణ కోసం ప్రజలకు ప్రయోజనకరంగా అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. నోటరీ చేయబడిన పత్రాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుదారు ఆస్తి వివరాలతో మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, నోటరైస్డ్ డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు, ఆస్తిపన్ను రసీదులు, విద్యుత్, నీటి పన్నుల రసీదులు, ఇతర భూ ఆధరిత డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకోవాలని, ప్రస్తుత స్టాంప్ డ్యూటీ రేట్ల ప్రకారం విధిగా విధించబడుతుందని, క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు సమర్పణ తేదీ ద్వారా మార్కెట్ విలువ గణన జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 3వేల చదరపు గజాలకు గరిష్ట పరిమితి విధించడం జరిగిందని తెలిపారు..

