ఏప్రిల్ 29న జరిగే చలో లేబర్ కమిషనర్ ఆఫీస్ ధర్నా వాల్ పోస్టర్ ను మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆవిష్కరణ చేశారు..
హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం రోజున తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు )రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఏప్రిల్ 29న జరిగే చలో లేబర్ కమిషనర్ ఆఫీస్ ధర్నా వాల్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది హమాలీలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సివిల్ సప్లై, ఎఫ్సీఐ, జీసిసి, మార్కెట్ యార్డు, కోల్డ్ స్టోరేజ్, సిమెంట్, గోదాములు, కూరగాయలు, పండ్లు మార్కెట్, రైస్ ఆయిల్ దాల్ మిల్స్, ఇసుక కంకర, క్వారీలు, రైల్వే, ఆర్టీసీ, గ్రామీణ బజార్ హమాలీలు, ఐకెపి హమాలీలు, బేవరేజెస్ హమాలీలు, స్టోర్ వర్కర్స్, ప్రజా పంపిణీ వ్యవస్థలో అనేక రకాల పనులు చేస్తూ రోజుకు 10 నుండి 12 గంటలు ప్రజలకు,ప్రభుత్వానికి అనేక రకాల సేవలు చేస్తున్నారు. ప్రభుత్వానికి హమాలీల శ్రమ నుండి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న హమలీల సంక్షేమం కోసం నయా పైసా కూడా కేటాయించకపోవడం అన్యాయం. కేంద్రంలో బిజెపి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ అమలు అయితే కార్మిక హక్కులన్నీ హరించకపోతాయి. చట్టబద్ధ సౌకర్యాలు ఉండవు. పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత ఉండదు. 8గంటల పని విధానం ఉండదు. కనీస వేతనాలు ఉండవు. కావున కేంద్ర బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు,కార్మికులు, అందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో హమలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 50 సంవత్సరాల వయసు పైబడిన హమాలీలకు నెలకి రూ.6000 పెన్షన్ ఇవ్వాలి. పిఎఫ్,ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలి. కనీస వేతనం, గుర్తింపు కార్డులు, రెండుజతల యూనిఫామ్ ఇవ్వాలి. హమాలీ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలి. పని ప్రదేశాల్లో హమాలీల కోసం టాయిలెట్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి. ఐకెపి హమాలీలకు ప్రభుత్వమే బిల్లులు చెల్లించాలి. ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ తీర్మానం ప్రకారం 50 కేజీలకు మించిన బరువులను నిషేధించాలి. ఈ నెల ఏప్రిల్ 29న హైదరాబాద్ లేబర్ కమిషనర్ ఆఫీస్ ధర్నాకు కార్మిక హక్కులు కాపాడుకోవడం కొరకై దండై కదులుదాం. లక్షలాది హమాలీలు పాల్గొనాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో హమాలీలు రాజన్న, శేఖర్, రాములు సంపత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు..

