
హైదరాబాద్: తెలంగాణలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మహాగణనాథుని తొలిపూజలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని ఖైరతాబాద్ గణేశ్ ను కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల, భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీ, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తదితరులు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఖైరతాబాద్ గణేశ్ ను 68 సంవత్సరాలుగా పూజిస్తున్నామన్నారు. ఈసారి మట్టి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు.


