భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో బూజు పట్టిన లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నారంటూ భక్తులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు.
బూజు పట్టిన లడ్డు
ఆంజనేయులు న్యూస్, భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో బూజు పట్టిన లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నారంటూ భక్తులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు తీర్థయాత్రలో భాగంగా రామయ్యను దర్శించుకున్నారు. కౌంటర్ లో రూ.25 విలువ గల లడ్డూలను కొన్నారు. వీటి రుచిలో తేడా కనిపించింది. వాటి పైభాగంలో బూజు పట్టడంతో పాటు నల్లటి మచ్చలున్నాయి. ఇంకొన్ని దుర్వాసన వచ్చాయి. కౌంటర్ లోని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు లడ్డూల విక్రయాన్ని నిలిపివేసి.. పులిహోర మాత్రమే అమ్మారు. కౌంటర్లతో పాటు తయారీ కేంద్రాన్ని ఈవో శివాజీ తనిఖీ చేశారు. కొన్ని లడ్డూలు పాడైపోవడంతో కౌంటర్ల నుంచి వెనక్కి పంపించామని, మిగిలిన వాటితో పాటు తాజాగా తయారు చేసినవాటిని విక్రయిస్తున్నామని తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అనుకున్న స్థాయిలో అమ్ముడుపోకపోవడంతో 20 వేల లడ్డూలు మిగిలిపోయాయని చెప్పారు. బూజు పట్టిన లడ్డూల విక్రయంపై విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.

