Telugu Updates
Logo
mobile after logo

కుటుంబ నియంత్రణపై మాట్లాడుకుందాం.

జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ అనిత

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కుటుంబ నియంత్రణపై మాట్లాడుకుందామని జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ అనిత అన్నారు. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా జిల్లాలోని నస్పూర్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం వరకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 21 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 100 పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలలో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. “గర్భధారణ, గర్భాల మధ్య అంతరం, తల్లిబిడ్డలకు గుర్తింపు క్షేమదాయకం” అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. కుటుంబ నియంత్రణ అనేది అభివృద్ధి చెందిన భారతదేశానికి నూతన గుర్తింపు తెస్తుందని, ప్రతి జంటకు గర్వకారణమని, ఈరోజు నుండే కుటుంబ నియంత్రణపై మాట్లాడుకుందామని, ఇందులో అనేక పద్దతులు ఉన్నాయని, సరైన పద్దతిని ఎంచుకొని పాటించాలని తెలిపారు. దేశంలోని ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండేందుకు కుటుంబ సంక్షేమ కార్యక్రమాలలో భాగం పంచుకుందామని, ఇందులో భాగంగా జిల్లాలో కుటుంబ నియంత్రణపై వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కార్యచరణ రూపొందించడం జరిగిందని, తాత్కాలిక పద్ధతులు ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభిస్తాయని తెలిపారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు అర్హులైన దంపతులకు కుటుంబ నియంత్రణపై తాత్కాలిక, శాశ్వత పద్దతుల గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. కుటుంబ సంక్షేమ కార్యక్రమాలలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను డా॥ అరుణశ్రీ-సర్జన్, రాజేశ్వరి-ఎ.ఎన్.ఎం., మార్త-సూపర్వైజర్, డి.కవిత-ఆశా కార్యకర్తలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం కుటుంబ నియంత్రణపై అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు డా|| నీరజ, డా॥ విజయపూర్ణిమ, డా॥ అరుణశ్రీ, డా॥ సమత, డా॥ ఫయాజ్, ఎస్.ఓ. వెంకటేశ్వర్లు, దామోదర్, శ్రీనివాస్, నాందేవ్, డి.పి.ఓ. ప్రశాంతి, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Post bottom