యూరియా కొరత తీర్చండి.. రైతుల ఆవేదన

ఆంజనేయులు న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలోని వాంకిడి, రెబ్బెన, జైనూర్ ,తిర్యాని తదితర మండలాల్లో యూరియా కొరతతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలను పండిస్తున్న రైతన్నలకు ప్రతి ఏడాది ఏదో ఒక విధంగా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. అదేరీతిలో ఈ ఖరీఫ్ సీజన్లో రైతును దిక్కుతోచకుండా చేస్తుంది. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో అవసరానికి సరిపడా యూరియా రాకపోవడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. జిల్లాలో రైతులకు యూరియా ను సరఫరా చేసేందుకు సహకార సంఘాలు, అగ్రోస్, హాకా తదితర కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఒక ఎకరాకు ఒక యూరియా బస్తాను వినియోగించాల్సి ఉండగా కొందరు రైతులు మోతాదుకు మించి యూరియాను వినియోగిస్తున్నారని తెలుస్తుంది. భూసార పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సైతం యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రావలసిన యూరియా కూడా సరిపడా రాకపోవడంతో ఉన్న యూరియాను తీసుకెళ్లేందుకు రైతులు సహకార సంఘాలు, రైతు వేదికలు, హాక, కేంద్రాల వద్దకు ప్రతిరోజు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీన్ని అదునుగా తీసుకొని కొన్ని హాక , అగ్రోస్ కేంద్రాలు యూరియాను దారి మళ్లించి ఫెర్టిలైజర్ వ్యాపారస్తులకు అమ్మిన సంఘటనలు సైతం జిల్లాలో చోటు చేసుకోవడం విస్మయం కలిగిస్తుంది. జిల్లాలో సుమారుగా 50వేల కు పైగా మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 21 వే ల మెట్రిక్ టన్నులను సరఫరా చేసినట్లు అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తుంది.

జిల్లాలో హాకా కేంద్రాల నిర్వహకులు కృత్రిమ కొరత సృష్టించడంతో ప్రతిరోజు ఏదో ఒకచోట రైతులు సహనం కోల్పోయి సహకార సంఘాల ఎదుట ధర్నాలు, రహదారులపై రాస్తారోకాలు, బైఠాయింపులు ,ధర్నాలు చేయడం పరిపాటిగా మారింది. గత ఎడారి ఎకరానికి రెండు యూరియా బస్తాలు ఇవ్వగా ఈ ఏడాది ఎకరాకు కొన్నిచోట్ల ఒకే బస్తా ఇవ్వడంతో రైతులు అధికారులపై మండిపడుతున్నారు. అంతేకాకుండా యూరియా స్థానంలో లిక్విడ్ బాటల్లు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. కానీ చాలామంది రైతులు యూరియా వినియోగం పైనే ఆసక్తి చూడంతో కొరత ఏర్పడుతుంది.
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి:
మారుతి పటేల్
– బీసీ సంక్షేమ సంఘం జిల్లా రైతు అధ్యక్షుడు
జిల్లా కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కృత్రిమ కొరత సృష్టించకుండా అధికారులు తనిఖీలు చేపట్టాలని రైతులకు సరిపడా యూరియాను తెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
