అమెరికాతో సంబంధం ఉన్న ఏ ఒక్క ప్రాంతాన్నీ వదిలి పెట్టబోం’’

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇరాన్ ఘాటు హెచ్చరిక చేసింది. అణు ఒప్పందానికి ఇరాన్ దిగిరాకుంటే బాంబుల మోత మోగిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూనే.. ఏం జరిగినా ఎదురుదాడి చేసేందుకు, తమ తడాఖా చూపించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ‘‘అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే బాంబు దాడులు చేస్తాం. ఈ దాడులు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటాయి.’’ అని అమెరికా అధ్యక్షుడు ఆదివారం హెచ్చరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. ‘‘అయితే… మేం కూడా సిద్ధంగా ఉన్నాం. మా తడాఖా చూపిస్తాం. ఎదురుదాడులు చేస్తాం. అమెరికా బాంబులు వేస్తే చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చోం. అన్ని భూగర్భ కేంద్రాల వద్ద లాంచ్ ప్యాడ్లపై క్షిపణులను సర్వసన్నద్ధం చేశాం. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాతో సంబంధం ఉన్న ఏ ఒక్క ప్రాంతాన్నీ వదిలి పెట్టబోం’’ అని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించినట్టు ఇరాన్ మీడియా ‘టెహ్రాన్ టైమ్స్’ పేర్కొంది. అమెరికా కాలు దువ్వితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఖమేనీ హెచ్చరించినట్టు తెలిపింది. ‘‘ఎలాంటి వైమానిక దాడులనైనా తిప్పికొడతాం. అమెరికాతో సంబంధం ఉన్న ఏ ఒక్క ప్రాంతాన్నీ వదిలిపెట్టేది లేదు’’ అని ఖమేనీ అన్నట్టు ‘టెహ్రాన్ టైమ్స్’ వెల్లడించింది. మరోవైపు, అణు ఒప్పందంపై అమెరికాతో నేరుగా చర్చించేందుకు ఇరాన్ నూతన అధ్యక్షుడు పెజెష్కియాన్ విముఖత వ్యక్తం చేశారు. అయితే, ఒమన్ ద్వారా మధ్యవర్తిత్వ చర్చలు మాత్రం కొనసాగుతాయని ఆయన సంకేతాలు ఇచ్చారు.


