
ఆంజనేయులు న్యూస్, జనగామ జిల్లా: ఆకాశం నుంచి ఉల్కలు పడ్డప్పుడు ఓ మంత్రపు పెట్టె దొరికిందని, దాంట్లో అద్భుత శక్తులు ఉన్నట్లు చెబుతూ పలువురిని మోసం చేస్తున్న నలుగురు నిందితులన జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో సోమవారం జరిగిన సమావేశంలో ఏసీపీ దామోదర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ హయత్ నగర్ లో ఉంటున్న నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూర్ కు చెందిన కేతావత్ శంకర్, నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంఘంబండకు చెందిన ఖాసీం, తాండూరుకు చెందిన మహ్మద్ అజార్, హయత్ నగర్ లో ఉంటున్న నల్గొండ జిల్లా డిండి మండలం దేవత్పల్లి తండా వాసి.. కొర్ర గాసిరాం అలియాస్ గాస్యలు ఆదివారం ఆటోలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా, పెంబర్తి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశా యి. మంత్రపు పెట్టె అని చెప్పి వరంగల్ కు చెందిన ఓ వ్యక్తికి రూ.50 కోట్లకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. సదరు పెట్టె కింది భాగంలో బ్యాటరీ వంటిది అమర్చినట్లు దర్యాప్తులో తేలింది. దానిపై అయస్కాంతం పెట్టగానే అది వైబ్రేటింగ్ వచ్చేలా, ఇనుప వస్తువుతో రాయగానే నిప్పురవ్వల మాదిరిగా స్పార్క్ వచ్చేలా చేశారు. వీటిని తయారు చేసి పలువురికి విక్రయించి మోసాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. మంత్రపు పెట్టె, నాలుగు చరవాణులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించామని ఏసీపీ వెల్లడించారు.
