
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్రస్థాయిలో గవర్నర్. జిల్లాల్లో కలెక్టర్ బాధ్యులుగా వ్యవహరిస్తూ వారి పర్యవేక్షణలో కొనసాగే ఏకైక స్వచ్చంద సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ. రాజకీయాలకు అతీతంగా.. ఏ పార్టీలకు సంబంధం లేకుండా నిర్వహించడం దీని ప్రధాన ఉద్దేశం. కానీ మంచిర్యాల శాఖ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో ఎన్నికలు తప్పేలా కన్పించడం లేదు. రెడ్ క్రాస్ మంచిర్యాల సొసైటీ 2008లో ఆవిర్భవించింది. ఇందులో 4367 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. ఈ సొసైటీకి మార్చి 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సంస్థ ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రం, అనాథ వృద్ధులు, పిల్లల ఆశ్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థ నిర్వహణకు ఎక్కడైనా కమిటీని ఏకగ్రీవంగా నియమిస్తారు. ఆరేళ్ల కిందట మంచిర్యాలలో ఓటింగ్ రూపంలో సభ్యులను ఎన్నుకున్నారు. సాధారణ ఎన్నికల మాదిరిగా వాడీవేడిగా జరగడం విశేషం. పదిమందితో కూడిన కమిటీని రెడ్ క్రాస్ సభ్యత్వం ఉన్న సభ్యులు ఎన్నుకునే అవకాశముంటుంది. వారికే ఓటు హక్కు ఉంటుంది. అలా మూడేళ్ల పదవీకాలంతో 2018లో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2021లో ఎన్నిక చేపట్టాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా వేస్తూ పాత కమిటీ పదవీకాలన్ని పొడిగిస్తూ వచ్చారు. ఇటీవల ఈ ఎన్నికలపై ఒత్తిడి పెరుగుతుండటం, ఇతర సభ్యుల డిమాండ్ దృష్ట్యా జిల్లా పాలనాధికారి సంతోస్ ఆదేశాలతో కొత్త కమిటీ(ఈసారి 15మంది సభ్యులు) నియామక ప్రక్రియను మరోసారి ప్రత్యక్ష ఎన్నికల ద్వారే జరిపించేందుకు డీసీఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే నామినేషన్ ల గడువు ముగిసిపోగా 32 మంది బరిలో నిలిచారు. స్వచ్ఛంద సంస్థకు ఎన్నికలు నిర్వహించడం ఏంటనే ఆలోచనతో సీనియర్, గత కమిటీ సభ్యుల ఏకగీవ్రం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 23న పూర్తయినప్పటి నుంచి ప్రయత్నిస్తుండగా ఆశించిన ఫలితం వస్తున్నట్లు కనిపించడం లేదు. రెండురోజులుగా పలుచోట్ల సమావేశాలు నిర్వహిస్తున్నా. సానుకూలమైన ఫలితం రాకపోవడంతో ఎన్నికలు తప్పేలా కనిపించడం లేదు.

