తన పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూడలేకే లా అండ్ ఆర్డర్ సమస్య సాకుగా చూపించి అరెస్టు చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తన పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూడలేకే లా అండ్ ఆర్డర్ సమస్య సాకుగా చూపించి అరెస్టు చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని, ఇంటిని వదిలేసి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ఇప్పటివరకు 3,500 కి.మీ. పాదయాత్ర చేసినట్లు చెప్పారు. కొంత మంది దుండగులు బస్సును తగలబెడితే వాళ్లని అరెస్టు చేయకుండా తనను ఈడ్చుకెళ్లి పోలీసు వ్యాన్ లో పడేశారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన షర్మిల.. పోలీసుల తోపులాటలో తగిలిన గాయాలను చూపించారు. ఈరోజు తెలంగాణ చరిత్రలో బ్లాక్ డే గా నిలిచిపోతుందని షర్మిల వెల్లడించారు. అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తుంటే.. తాను మాత్రం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవని చెబితే తాను ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమన్నారు. తెరాసలో చేరిన నాటి ఉద్యమకారులు ఏమయ్యారని షర్మిల ప్రశ్నించారు.
