
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా: నిరుపేదల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సదా స్మరణీయుడని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 372 జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతికి విశేష కృషి చేశారని, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ, దౌర్జన్య వ్యవస్థను రూపుమాపి ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అందించేందుకు పాటుపడ్డారని తెలిపారు. దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాలను చైతన్యపర్చాడని, ఇదే స్ఫూర్తితో పాపన్నగౌడ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించి భావి తరాలకు చరిత్ర తెలిసేలా కృషి చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. మహాత్ముల జీవితచరిత్ర నుండి మనం తెలుకునేది ఎంతో ఉంటుందని, 372 సంవత్సరాల క్రింత సాధారణ కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గురించి ఇప్పటికీ మనం స్మరించుకోవడం జరుగుతుందని, ఇందుకు కారణం వారు ఆచరించిన జీవిత విధానమేనని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా రాష్ట్ర, దేశాభివృద్ధికి అందరు కలిసి కృషి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు రాజేందర్, సంబంధిత అధికారులు, న్యాయవాదులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, గౌడసంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

