
అదిలాబాద్ జిల్లా: అనుమానం పెనుభూతమై చివరకు భర్త భార్యను కడతేర్చిన ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటు చేసుకుంది. జైనథ్ ఎస్ఐ బిట్ల పెర్సిస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో గూడ రాంపూర్ గ్రామానికి చెందిన కవిత కు గత పది ఏళ్ల క్రితం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపాల్ గూడ కు చెందిన అలిశెట్టి విష్ణు తో వివాహం జరిగింది. కాగా గత కొంతకాలంగా ఉపాధి నిత్యం భార్యభర్తలు హైదరాబాదులో ఉంటున్నారు. అయితే ఎప్పుడు భార్య భర్తలు గొడవ పడేవాళ్ళని సమాచారం. హైదరాబాద్ నుండి సోమవారం ఉదయం ఆదిలాబాద్ కు వచ్చిన భార్యాభర్తలు భార్య కవిత గ్రామమైన గూడ రాంపూర్ కు ప్రయాణమయ్యారు..
బోరజ్ దగ్గర బస్సు దిగి వారు గూడ గ్రామానికి బయల్దేరారు. అయితే దగ్గరి మార్గం నుండి వెళ్తాం అంటూ భార్యను నమ్మించిన విష్ణు గ్రామ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపి, చెట్టుకు ఉరి వేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు యత్నించాడు. కానీ కొంత సమయానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తానే భార్యను చంపినట్లు పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
