మంచిర్యాల సెప్టెంబర్ 7, ( ఆంజనేయులు న్యూస్ )
ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆటపాటల ద్వారా వివరించారు. సోమవారం మంచిర్యాల జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, డీపీఆర్వో పర్యవేక్షణలో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తానిమడుగు గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేద ప్రజలకు ఎలాంటి మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా చేరేలా ప్రజాపాలన కొనసాగుతోందని వివరించారు. ఇప్పటికే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, యువ వికాసం తదితర పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని కళాకారులు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ముల్కల్ల మురళి, లావుడ్యా రమేష్, మామిండ్ల లచ్చన్న, వెళ్తూరు పోశం, గొడిసెల కృష్ణ, మిట్టపల్లి సంధ్య, చేగొండ నిరోష, తస్లీమాతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
