బెల్లంపల్లిలో సనాతన టెక్ల్యాబ్స్ ఉద్యోగులకు మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
మంచిర్యాల, జూలై 24, ( ఆంజనేయులు న్యూస్ )
మహిళలపై వేధింపులు, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించేందుకు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లిలోని సనాతన టెక్ల్యాబ్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో, జిల్లా షీ టీమ్ ఎస్ఐ ఉషారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు, ఈవ్టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ట్రాఫిక్ నిబంధనలు, టీ-సేఫ్ యాప్ వినియోగం, షీ టీమ్స్ సేవలపై ఉద్యోగులకు సమగ్ర అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్–100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385లకు సమాచారం అందించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా షీ టీమ్ కానిస్టేబుళ్లు శ్రవణ్, శ్రీలతతో పాటు సనాతన టెక్ల్యాబ్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు పాల్గొన్నారు.
