
జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి బి.శ్రీకాంత్ రెడ్డీ
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జనవరి 4, 2023న డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ లో జిల్లా స్థాయి యువజన ఉత్సవ పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి బి.శ్రీకాంత్ రెడ్డీ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 4న ఉదయం 10 గం||ల నుండి జానపద నృత్యం (గ్రూప్), జానపద సంగీతం (గ్రూప్) అంశాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తి గల కళాకారుల వయస్సు 15-29 సం॥ల మధ్య ఉండాలని, కలర్ ఫొటో, పుట్టిన తేదీ తెలుపు సర్టిఫికెట్ ప్రతి, ఆధార్ కార్డు తో పోటీలు జరుగు రోజున తమ వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని పోటీలలో పాల్గొనాలని, పోటీలలో ప్రథమ బహుమతి గెలుపొందిన వారు జనవరి-2023 రెండవ వారంలో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని, ఈ పోటీలలో ప్రథమ బహుమతి పొందిన వారు జనవరి 12 నుండి 16వ తేదీ వరకు జరిగే జాతీయ యువ ఉత్సవాల పోటీలలో విధిగా పాల్గొనవలసి ఉంటుందని తెలిపారు. జానపద నృత్యం అంశంలో గరిష్ఠంగా 20 మంది సభ్యుల బృందం 15 నిమిషాల గరిష్ఠ కాలపరిమితికి మించకుండా భారతీయ జానపద శైలికి సంబంధించిన నృత్య ప్రదర్శన నిర్వహించాలని, ప్రీ రికార్డెడ్ ఆడియో క్యాసెట్స్ జిల్లా స్థాయి పోటీలలో అనుమతి ఉంటుందని తెలిపారు. జానపద గీతాలు అంశంలో గరిష్ఠంగా 10 మంది సభ్యుల బృందం 7 నిమిషాల గరిష్ట కాలపరిమితికి మించకుండా ప్రదర్శన నిర్వహించాలని తెలిపారు. నృత్యానికి, గీతాలకు కావలసిన వాయిద్యాలు, ఇతర వస్తువులు బృందం వారు సమకూర్చుకోవాలని తెలిపారు. పోటీలలో పాల్గొను యువతీ, యువకులు కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఆసక్తి గల యువతీ, యువకులు తమ వివరాలను జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

