
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్, హైదరాబాద్ వారు విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్స్ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మాత్యులు మహమూద్ ఆలి మరియు శాసనసభ మాజీ స్పీకర్ మధుసూధనాచారి పాల్గొన్నారు. వారి చేతులమీదుగా ప్రతిష్టాత్మక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్ తో ట్రస్మా జిల్లా అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి మరియు జిల్లా కోశాధికారి సురభి శరత్ కుమార్ లను సత్కరించారు. కరోనా విపత్తు కాలంలో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను, బోధనేతర సిబ్బందిని నిత్యవసర సరుకులు పంపిణీ చేసి ఆదుకున్నందుకు గాను మరియు కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి మనోధైర్యాన్ని కోల్పోయిన తరుణంలో ఉపాధ్యాయులకు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు అండగా ఉన్నందుకుగాను, విద్యారంగ సమస్యలపై వారు చేస్తున్న నిరంతర కృషి మరియు సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్ రావు కి, కరోనా విపత్తు కాలంలో శాన్వి ఈ లెర్నింగ్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు పాఠశాలకు ఉచితంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించినందుకు గాను వారి సేవలను గుర్తించి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి కి మరియు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేస్తున్న సేవలు మరియు గ్రామీణ ప్రాంతంలో కొన్ని వేలమందికి ఉత్తమ విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తుకు చక్కటి దిశా నిర్దేశం చేస్తున్నందుకు జిల్లా కోశాధికారి సురభి శరత్ కుమార్ ను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ అమరేష్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. అవార్డులు తీసుకున్న వీరిని జిల్లాలోని ప్రముఖులు వివిధ పాఠశాల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు అభినందించారు.

