
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా: నేటి బాలల చేతుల్లోనే రేపటి భారతదేశ భవిష్యత్తు ఉందని, స్వాతంత్య్ర పోరాట పటిమ, మహనీయులు, పోరాట యోధుల త్యాగాలు, కుల, మత, వర్ణ, వర్గ విభేదాలు, లింగబేధం లేని సమానత్వం, దేశ చరిత్ర బాలలకు తెలియజేసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. స్వాతంత్ర్య వత్రోత్సవ వేడుకలలో భాగంగా మంగళవారం రోజున 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు జిల్లాలోని సినిమా థియేటర్లలో గాంధీ చిత్ర ప్రదర్శన నిర్వహించడంలో భాగంగా స్థానిక జెమిని థియేటర్లో ప్రదర్శించిన చిత్రాన్ని బాలలతో కలిసి తిలకించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తవుతున్నందున కేంద్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ఆజాద్ – కా – అమృత్ -మహోత్సవ్ (స్వాతంత్ర్య వత్రోత్సవ మహోత్సవం) కార్యక్రమంలో జిల్లాలో 22వ తేదీ వరకు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ త్యాగధనుల సేవల వల్లనే లభించిందని తెలిపారు. ఎంత ఎత్తుకు ఎదిగినా దేశాన్ని మర్చిపోకూడదని, దేశ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, పాటలు, సామాజిక సేవ వంటి అన్ని రంగాలలో ముందుండాలని, దేశ భవిష్యత్తు బాలల చేతుల్లోనే ఉందని, పాఠశాల స్థాయి క్రమశిక్షణ, సత్ప్రవర్తన అలవర్చుకొని దేశ అభివృద్ధికి పాటు పడేలా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

