
అటవీ డివిజనల్ అధికారి మాధవరావు
మంచిర్యాల జిల్లా: జాతీయ స్థాయిలో టైగర్ రిజర్వ్ గా గుర్తించిన అటవీ ప్రాంతంలో భూ ఆక్రమణ, వ్యవసాయ సాగు చేయడం చట్ట రీత్యా నేరమని జన్నారం అటవీ డివిజనల్ అధికారి మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. టైగర్ రిజర్వ్ పూర్తిగా అటవీ ప్రాంతమని, ఇందులో సాగు చేయకూడదని, 2009లో కోయపోషగూడ గ్రామస్తులు సాగు చేయడం కోసం ప్రయత్నించి, 2021 నుండి చేయడం ప్రారంభించారని, ఈ చర్యను విరమించాలని కోరుతూ గ్రామస్తులకు నిరంతర కౌన్సిలింగ్ చేయడం జరిగిందని తెలిపారు. మే 2022లో మహిళలతో ప్రారంభించి భారీ సంఖ్యలో అటవీ ప్రాంతాన్ని చదును చేశారని, ఈ క్రమంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి, అటవీ శాఖ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో పాటు వివిధ స్థాయిలలోని అధికారులు ఇట్టి భూమి ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టం పరిధిలోకి రాదని గ్రామస్తులకు నచ్చజెప్పి ఖాళీ చేయాలని కోరినప్పటికీ వివిధ రాజకీయ పార్టీలు, ఆదివాసీ ఫెడరేషన్లు ఈ సమస్యను సమర్థించడంతో గ్రామస్తులు ఇవేమీ పట్టించుకోకుండా ఆ ప్రాంతాన్ని వదిలివెళ్ళే స్థితి లేదని తెలిపారు. కోయపోషగూడ గ్రామంలో అందరికీ ఇళ్ళు ఉన్నాయని, ఈ ప్రాంతం అడవికి ఆనుకొని ఉండటంతో ఆక్రమణలో భాగంగా కొద్ది రోజుల క్రితం గుడిసెలు ఏర్పాటు చేయడంతో పాటు సానుభూమి పొందేందుకు పిల్లలను అటవీ ప్రాంతానికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ప్రాంతం 2012లో నోటిఫై చేయబడిన కవ్వాల్ టైగర్ జోన్ రిజర్వ్ పరిధిలోని బఫర్ జోన్లో ఉందని, ఈ ప్రాంతం టైగర్ రిజర్వ్ లో భాగమైనందు వలన వన్యప్రాణులు, విషపురుగుల నుండి ముప్పు ఉందని, అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు చాలా సార్లు గ్రామస్తులను కోరారని తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలు, చట్టంను అనుసరించి గత రెండు రోజుల క్రితం పోలీసులు, అటవీ అధికారులతో కలిసి అట్టి గుడిసెలను తొలగించారని, ఈ ప్రక్రియలో గ్రామస్తులు మిరపకాయను విసిరారని, కర్రలతో కొట్టడంతో పాటు సిబ్బందిపై రాళ్లను విసిరడంతో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని, దీనితో పాటు విధి నిర్వహణలోని తడల్పేట పరిధిలోని ప్రభుత్వ జీపును ధ్వంసం చేశారని, కాని శాఖ వైపు నుండి ఎటువంటి దాడి జరగలేదని, కేవలం గ్రామస్తులు మాత్రమే సిబ్బందిపై దాడి చేయడం జరిగిందని తెలిపారు. టైగర్ రిజర్వ్ ప్రాంతంలో భూమిని ఆక్రమించడం చట్ట రీత్యా నేరమని, కోయపోషగూడ గ్రామస్తులు అటవీ అధికారులకు సహకరించాలని కోరారు.


